చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం 1.1 శాతం మేర పెంచింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మాత్రమే ఈ పెంపును పరిమితం చేసింది. జులై 1వ తేదీ నుంచి పెంచిన వడ్డీ రేటు అమలులోకి రానుంది.
జులై 1 – సెప్టెంబర్ 30వ తేదీ మధ్యకాలానికి మాత్రమే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పెంచిన వడ్డీరేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ తరువాత ఇది అమలులో ఉండదు. ఆ తరువాత దీన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
సేవింగ్స్ డిపాజిట్లకు మినహాయింపు ఇచ్చింది. వీటిని ఈ పెంపు పరిధిలోకి తీసుకుని రాలేదు. టైమ్ డిపాజిట్లకు మాత్రమే వర్తింపజేసింది. కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతం 4.0 శాతం వడ్డీ రేటు ఉంది. దీన్ని అలాగే కొనసాగించనుంది. తొలి సంవత్సరం టైమ్ డిపాజిట్లపై 6.8 నుంచి 6.9, రెండో సంవత్సరం టైమ్ డిపాజిట్పై 6.9 నుంచి 7.0కు పెంచింది.
మూడో సంవత్సరం టైమ్ డిపాజిట్పై వడ్డీ రేటు యధాతథంగా కొసాగుతుంది. అంటే ఇప్పుడున్న 7.0 శాతమే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంటుంది. అయిదో సంవత్సరం టైమ్ డిపాజిట్ వడ్డీ రేటులోనూ మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 7.5 ఇకముందు కూడా కొనసాగుతుంది.
అయిదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపైనా వడ్డీరేటులో మార్పులు చేసింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న 6.2 శాతాన్ని 6.5కు పెంచింది. సీనియర్ సిటిజన్ల సేవింగ్ పథకాలపై 8.2, మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్పై 7.4, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్పై 7.7, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వడ్డీరేటు 7.1లో కూడా మార్పులు చేయలేదు.
వాటన్నింటినీ యధాతథంగా కొనసాగించింది. దీనితో పాటు 115 నెలల్లో మెచ్చూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రాలపై చెల్లించే వడ్డీ రేటులోనూ మార్పులకు పూనుకోలేదు. ఇప్పుడున్న 7.1 శాతం కొనసాగుతుంది.