ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆయా రాష్ర్టాల మంత్రులతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులూ హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్లపై పన్ను ఎంతన్నదానిపై ఎప్పట్నుంచో పరిశీలిస్తున్న మంత్రుల బృందం సిఫార్సుల ఆధారంగా ఈ 28 శాతం పన్నును నిర్ణయించినట్టు భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ తెలిపారు.
నిజానికి బెట్టింగ్ ముఖ విలువపై పన్ను వేయాలా? లేదా గేమింగ్ స్థూల రెవిన్యూపై విధించాలా? లేకపోతే ప్లాట్ఫామ్ ఫీజులపై మాత్రమే వర్తింపజేయాలా అన్నదానిపై మంత్రుల బృందం తర్జనభర్జనపడ్డట్టు మంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వాల్యూపై పన్ను వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఆన్లైన్ గేమింగ్ సంస్థల టర్నోవర్, బెట్టింగ్ పూర్తి ముఖ విలువ, ఆట కోసం చేసే చెల్లింపులు ఇలా అన్నింటికీ పన్ను వర్తిస్తుందని వివరించారు. అయితే ఈ నిర్ణ యం మా వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని గేమిం గ్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అరుదైన వ్యాధులు, క్యాన్సర్పై పోరాటం చేసే డ్రగ్స్, మెడిసిన్లకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు ఆపరేటర్లు అందించే శాటిలైట్ లాంచ్ సేవలపై కూడా జిఎస్టిని మినహాయించారు.
సినిమా హాళ్లలో లభించే ఆహార పదార్థాలు, పానీయాల ధరలు ఇకపై తగ్గనున్నాయి. థియేటర్లలో ఫుడ్పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జిఎస్టి 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా పాప్కార్న్, డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలను సినిమా టిక్కెట్లతో కలిపి విక్రయిస్తే, అసలు ఉత్పత్తి ఆధారంగా పన్ను విధించాలని కూడా సూచించింది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ఉండగా, జిఎస్టి (వస్తు, సేవల పన్ను) నెట్వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది టాక్స్ టెర్రరిజం, చిన్న వ్యాపారాలను భయపెట్టే ప్రయత్నమని ఆప్ పాలిత పంజాబ్ ఆర్థికమంత్రి హర్పల్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2002 పిఎంఎల్ఎ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం)కు సవరణలు చేస్తూ ఇడికి జిఎస్టి సమాచారం పంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎంఎల్ఎ పరిధిలోకి జిఎస్టి తెస్తూ ఇచ్చిన నోటిఫికేషన్పై ఈ భేటీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వ ఆర్థికమంత్రులు ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, చత్తీస్గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల మంత్రులు కూడా వారితో స్వరం కలిపారు.