మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ `రజాకార్ ఫైల్స్’ సినిమా రాబోవడం రాజకీయంగా సంచలనం సృష్టింపనుంది. ‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్ని శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ రావు, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సినిమాకు యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహించారు. ఈ ‘సమర్వీర్ క్రియేషన్స్’ బ్యానర్పై బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా మత ఘర్షణల చరిత్ర కాదని స్పష్టం చేశారు. ఇది ఎవరిలో అసంతృప్తిని కలిగించడానికి రూపొందించబడింది కాదని తెలిపారు.
ఇక.. షేక్ బందగి, మక్దూమ్ మొయినుద్దీన్, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి ముఖ్యమైన ముస్లిం వ్యక్తుల పేర్లను ఈ సినిమాలో ప్రస్తావించినట్టు సమాచారం. అయితే, సినిమా నిర్మాతలను బండి సంజయ్ అభినందించారు. ఆ తర్వాత ‘పాత బస్తీ ఫైల్స్’ (ఓల్డ్ సిటీ) తీయాలని నిర్మాతను కోరుతున్నట్టు చెప్పారు.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నుండి ప్రేరణ పొందిన తర్వాత దర్శక-నిర్మాత ద్వయం రజాకార్లపై సినిమాని రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అనేక దురాగతాలకు నిజాంలే కారణమని చిత్ర నిర్మాతలు పేర్కొంటుండగా, బండి సంజయ్ మాత్రం “కొందరు చార్మినార్, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూపించి నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.