కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాందీ మరణాన్ని కుమారుడు ధ్రువీకరించారు.
గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ అందించారు. చాందీ మరణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ నేతలు సంతపాన్ని తెలియజేశారు.
ఊమెన్ చాందీ పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురం తరలిస్తారు. అక్కడి నుంచి కొట్టాయంకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్లో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.
చాందీ పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చాందీ 1977లో కె.కరుణాకరన్ కేబినెట్లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీలో కీలక నేతగా ఎదిగారు.. చాందీ 2004- 2006 వరకు.. అలాగే 2011- 2016 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
