తెలంగాణలో వివాదాస్పదమైన ‘ధరణి’ పోర్టల్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పలాయనవాదం అనుసరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీపై నెపం నెడుతున్నారని, ఈ తప్పులను ప్రశ్నించే వారిపై అప్రజాస్వామికంగా, నిరంకుశంగా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
లండన్ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వ తప్పిదాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించడం, తమను ఎదిరించేవారిని అధపాతాళానికి తొక్కేయడం లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
.ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ‘ధరణి’ అంశంలో తమకు ఏ తప్పు తెలియదని చేతులు కడుక్కున్న చందంగా కేసీఆర్ ఈ అంశంపై ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటనలు ఇప్పించారని మండిపడ్డారు.
ధరణి కారణంగా తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా 75 లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేసుకుంటున్న వారి నుంచి భరోసా కల్పించాల్సింది పోయి తన అసమర్థతను మరోసారి చాటుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మారుతున్న సాంకేతికత నేపథ్యంలో డేటా ప్రైవసీ (గోప్యత) ఓ కీలకమైన అంశంగా ఉందని పేర్కొంటూ ప్రభుత్వ వెబ్సైట్లకు, ప్రభుత్వ సంబంధిత అంశాలకు సంబంధించిన డేటా విషయంలో సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
వీటి విషయంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ధరణి విషయంలోనూ డేటా సంబంధిత విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం ప్రజల సమస్యలు, రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా పాత సమస్యలను తీర్చాల్సిందిపోయి.. కొత్త సమస్యలను సృష్టించిందని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కలెక్టర్లపైనా అదనపు భారం పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ‘స్వమిత్వ యోజన’ ద్వారా పేదలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఆస్తి ధృవీకరణ పత్రాలను, టైటిల్ డీడ్లను అందజేస్తోందని గుర్తుచేశారు. అదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం వైఫల్యాలను చవిచూస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా మరిన్ని ఇబ్బందుల పాలుచేస్తోందని విమర్శించారు
