“మేరీ మాటి మేరా దేశ్” పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ఆకాశవాణి ద్వారా జరిపే “మన్కీ బాత్ ” కార్యక్రమం 103 ఎపిసోడ్లో ఆదివారం ప్రధాని ఈ కీలక ప్రకటన చేశారు.
“అమరవీరులకు గౌరవ సూచకంగా దేశం లోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశం లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మటి, మొక్కలను సేకరించి ఢిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే ‘అమృత్ వాటిక’ పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ప్రతీకగా ఈ అమృత్ వాటిక నిలుస్తుంది” అని ప్రధాని తెలిపారు.
అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్నవారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన తీరును ప్రధాని అభినందించారు.
ఇటీవల తన పర్యటన సందర్భంగా భారత్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 కు పైగా కళాఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చినందుకు ప్రధాని అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. 2016, 3021లో తన అమెరికా పర్యటన సందర్భంగా కూడా అమెరికా కొన్ని కళాఖండాలను భారత్కు తిరిగి ఇచ్చినట్టు చెప్పారు.
సుమారు రూ. 12 కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్ధాలను భారత్ నాశనం చేసి రికార్డు సృష్టించిందని మోదీ వెల్లడించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా దేశ యువత సమష్టిగా చేస్తున్న పోరాటం అభినందనీయమని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఒక్క రోజులో 30 కోట్ల మొక్కలు నెలకొల్పారని పేర్కొంటూ ప్రజా భాగస్వామ్యం తోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
భారత్ లోని యాత్రాస్థలాలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని, కాలిఫోర్నియా నుంచి అమర్నాథ్ యాత్రకు ఇద్దరు విదేశీ యాత్రికులు వచ్చారని ప్రధాని చెప్పారు. గత ఏడాది అక్టోబర్లో ఉత్తరాఖండ్ మహిళల నుంచి తాను ప్రత్యేకంగా అందుకున్న భోజ్పత్ర గురించి ప్రధాని ఈ కార్యక్రమంలో మాట్లాడారు. విభిన్నమైన కళాకృతిని భోజ్ పత్రంపై వారు తనకు బహూకరించినట్టు తెలిపారు.
పురాతన కాలం నుంచి గ్రంథాలు, పుస్తకాలను భోజ్ పత్రాల లోనే భద్రపరుస్తున్నట్టు మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్కు వెళ్లే పర్యాటకులు స్థానిక ఉత్పత్తులను ఎక్కువగా కొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఐరోపా, ఆసియాతోపాటు హిమాలయాల్లో పెరిగే బెతులా యుటిలిస్ లేదా హిమాలయన్ బిర్చ్ అనే మొక్క బెరడునే భోజ్పత్ర అని పిలుస్తారు. కాగితం కనిపెట్టక ముందు ఈ చెట్టు బెరడుపైనే గ్రంథాలు రాసేవారు.