అల్లర్లలో ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైతే ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోదని హరియాణా అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే ఓ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
‘‘ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేస్తాం. దాన్ని బాధితులకు ఇస్తాం. అంతేగానీ, ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు. ఒకవేళ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయితే మాత్రం పరిహారం చెల్లిస్తాం’’ అని ఆయన వెల్లడించాయిరు. వీహెచ్పీ కార్యకర్త మోనూ మనేసర్ వల్లే ఈ అల్లర్లు జరిగాయనే ఆరోపణలుండగా.. అతను కేవలం రాజస్థాన్ రాష్ట్రంలో నమోదైన కేసులో నిందితుడని చెప్పారు.
కాగా.. హరియాణా అల్లర్లకు సంబంధించి మొత్తం 41 కేసులను నమోదు చేశామని, 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ పీకే అగర్వాల్ వెల్లడించారు. ఈ కేసుల దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అల్లర్లలో ఒక ఇమాం, ఇద్దరు హోంగార్డులతోపాటు.. ముగ్గురు వ్యక్తులు మరణించారని వివరించారు.
ఇమాం అరెస్టుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. మోనూ మనేసర్ను విచారిస్తున్నామని చెప్పారు. అయితే.. మోనూ బుధవారం సాయంత్రం మౌనం వీడారు. హింస, ఆరుగురు మృతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమిన్ఖాన్ కారణమని ఆరోపించారు. తాను కేవలం గోరక్షకుడినేనని చెప్పారు.
మరోవంక, హరియాణాలో తమ ర్యాలీపై దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్దళ్ కార్యకర్తలు బుధవారం ఢిల్లీలోని సుమారు 32 ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. దీంతో.. ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని రహదారుల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అటు గురుగ్రామ్లోనూ వీహెచ్పీ, బజరంగ్దళ్ ఆందోళనలతో టెన్షన్ నెలకొంది. అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఢిల్లీలో ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎక్కడా ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని, భారీగా బలగాలను మోహరించాలని, సీసీకెమెరాలతో నిఘాను కొనసాగించాలని సూచించింది.
ఢిల్లీలో వీహెచ్పీ, బజరంగ్దళ్ నిర్వహించతలపెట్టిన ర్యాలీలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం మరోమారు స్పందించింది. ఈ నిరసనల్లో ఎలాంటి హింస, విద్వేష ప్రసంగాలు గానీ లేకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిల ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
కాగా, హర్యానాలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. మత ఘర్షణలు మరింతగా వ్యాపించే అవకాశం ఉండటంతో అల్లర్లకు కేంద్రమైన నూహ్తోపాటు ఫరీదాబాద్, పల్వాల్, సోహ్నా, పటౌడీ, గురుగ్రామ్లోని మానెసర్లో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ , ఎస్ఎమ్మెస్ సేవలను నిలిపివేసింది .
ఇది ఈ నెల 5 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. మత ఘర్షణలను నివారించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికు 116 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.