అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతదాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండల వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు.
పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది.
సిసి కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయేసరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది.
వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పాప కనిపించడం లేదని తెలుసుకున్న టిటిడి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంగా గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు, టిటిడి సిబ్బంది పాప కనిపించలేదు. శనివారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే కాలినడకన వెళ్తున్న భక్తులకు లక్షిత మృతదేహం కనిపించింది. చాలా మంది ఆ దృ శ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే కొందరు తిరుమల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహంను పరిశీలించి లక్షిత మృతదేహంగా గుర్తించారు.
పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలో పాప చనిపోయిందని నిర్ధారించారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో తరచూ చిరుత భయ పెడుతోంది. జూన్లో కూడా ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది. ఏడో మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది.
బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతం లో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు.
చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం అందించిన అధికారులు సురక్షింతంగా బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 2009లో కూడా నడక మార్గంలో ఓ చిన్నారిపై దాడి చేసింది. భక్తులు వెంటనే స్పందించడంతో పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. పాప గాయాలతో సురక్షితంగా బయటపడింది.
తిరుమల అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘ టన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్, నడక దారిలో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యం లో టిటిడి చైర్మన్ బి కరుణాకరరెడ్డి ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అటవీ శాఖ, పోలీస్ అధికారులతో సమావేశం జరిపి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. కాలినడక మార్గంలో ప్రతి 10 మీటర్లకు ఒక గార్డ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భక్తల భద్రతను దృష్టిలో వుంచుకుని సాయంత్రం 6 గంటలకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసేయాలని దానిపై కసరత్తు చేస్తున్నామని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. చిన్నారి లక్షిత కుటుంబానికి టిటిడి నుంచి రూ.5 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని ఇవో పేర్కొన్నారు.
మరోవైపు నడక మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహస్వా మి ఆలయం వరకు హై అలర్ట్ జోన్గా టిటిడి ప్రకటించింది. ఈ మార్గంలో వచ్చే భక్తులకు ముందు, వెనుక రోప్లను ఏర్పాటు చేయనున్నారు. 100 మంది భక్తుల గుంపును అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు. చిరుత కదలికలను గుర్తించేందు కు అత్యాధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.