భారత ప్రభుత్వం ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. చంద్రుడికి సమీప కక్షలోకి చేరిన చంద్రయాన్ 3 లో ప్రొపెల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యుల్ గురువారం విజయవంతంగా వేరుపడ్డాయి. ప్రొపెల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యుల్ విజయవంతంగా విడిపోయాయని ఇస్రో గురువారం మధ్యాహ్నం ప్రకటించింది.
ఇది చంద్ర యాన్ ప్రయోగంలో మరో అత్యంత కీలక ఘట్టం. ఇకపై ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా చంద్రుడి దిశగా తన ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ల్యాండర్ మాడ్యూల్ ను మరికొంత కింది కక్ష్యలోకి చేర్చి, వేగాన్ని తగ్గించే కార్యక్రమాన్ని ఆగస్ట్ 18 సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభిస్తామని ఇస్రో వెల్లడించింది.
ప్రస్తుతం చంద్రుడి చుట్టూ భారత్ కు చెందిన మూడు ఉపగ్రహాలున్నాయని తెలిపింది. ఆగస్టు 16వ తేదీన చంద్రుడికి అత్యంత సమీపంలోని 153 x163 కిలోమీటర్ల కక్ష్యలోకి చంద్రయాన్ 3 వెళ్ళింది. ఇప్పుడు, ఆగస్ట్ 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఉన్నల్యాండర్ మాడ్యూల్ విడివడింది.
ఇకపై ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా చంద్రుడి దిశగా తన ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తరువాత, ఈ ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుడికి సమీపంలోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేర్చే కార్యక్రమాన్ని ఇస్రో చేపడ్తుంది.
చంద్రుడికి అత్యంత సమీపంగా 30 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 100 కిలోమీటర్లు ఉన్న దీర్ఘ వృత్తాకారక్షలో చంద్రయాన్ 3 చేరాల్సి ఉంది. ఆ తరువాత క్రమంగా లాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తూ నిట్టనిలువుగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై దింపాల్సి ఉంటుంది. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 చంద్రుడు పై కాలు మోపుతుంది.
చంద్రునిపై దిగేముందు లాండర్ వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ నిట్ట నిలువునా చంద్రుడు ఉపరితలంపై క్షేమంగా దింపడమనే ప్రక్రియ చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ. దీర్ఘ వృత్తాకార కక్ష్య తిరుగుతున్న లాండర్ మోడ్యుల్ని వేగాన్ని తగ్గిస్తూ, గమనాన్ని మారుస్తూ నిట్ట నిలువుగా చంద్రుడి పైకి క్షేమంగా దింపే దశ అత్యంత క్లిష్టమైనదిగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
చంద్రుడిపై దిగిన తర్వాత ల్యాండర్ నుంచి ర్యాంప్ ద్వారా ఆరు చక్రాల రోవర్ చంద్రుడిపై నడక ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు ఆ విక్రం రోవర్ చంద్రుడి ఉపరితలంపై కలియతిరుగుతూ ఫొటోలు తీస్తుంది. అక్కడి మట్టిని సేకరిస్తుంది.
చంద్రయాన్ 3 భారత ప్రభుత్వం చంద్రుడిపై ప్రయోగాల కోసం చేపట్టిన మూడవ ప్రయోగం. చంద్రయాన్ 2 చివరి దశలో, చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆ ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులై 14న ఇస్రో చేపట్టింది.