తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 115 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బిఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్లో పెట్టినట్లు చెప్పారు.
వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చినట్లు చెప్పారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ఇక కెసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ కేసీఆర్ చేయనున్నారు. 2023 ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఆరేడుగురు మాత్రమే సిట్టింగ్లను తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు.
ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు.
గుజరాత్, మహారాష్ట్రలను తలదన్ని తెలంగాణ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తోంది దేశంలోనే తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కర్ణాటకలో తెలిసిపోయిందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతోందని కేసీఆర్ ప్రకటించారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్లో 29 సీట్లకు ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచినట్లు చెప్పారు.