చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇక రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై చివరి నిమిషంలో కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు.
ల్యాండర్ మాడ్యూల్కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ దిగేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.
‘‘ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందు ఓసారి అన్ని అంశాలను పరిశీలిస్తాం. ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 24కు ల్యాండింగ్ తేదీని మారుస్తాం’’ అని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
చంద్రయాన్-2 వైఫల్యంతో నేర్చుకున్న అనుభవాలను మిళితం చేస్తూ చంద్రయాన్-3ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం చంద్రుడిపై దిగేందుకు అనువైన పరిస్థితుల కోసం విక్రమ్ ల్యాండర్ వేచిచూస్తోంది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ దాదాపు చంద్రుడి ఉపరితలానికి చేరుకున్నది.
కాగా, చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్ .. విక్రమ్కు వెల్కమ్ చెప్పింది. ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. వెల్కమ్ బడ్డీ అంటూ ఆ మెసేజ్లో పోస్టు చేశారు.
చంద్రయాన్-2 ఆర్బిటార్, చంద్రయాన్-3 ల్యాండర్తో టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్రమ్ ల్యాండింగ్పై లైవ్ టెలికాస్ట్ ఉంటుందని ఇస్రో వెల్లడించింది.