‘రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్ప్లాంట్లో ఉక్కు ఉత్పాదకత ఉండదు. దీని జీవిత కాలం రెండేళ్లే అని నేను భావిస్తున్నాను’ అంటూ కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా స్టీల్ సందర్శకుల పుస్తకంలో రాసి సంతకం చేశారు. మంగళవారం వైజాగ్ స్టీల్ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) పర్యటనకు విచ్చేసిన ఆయన పైవిధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్లాంటు పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి.. రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఉక్కుశాఖ కార్యదర్శి వ్యాఖ్యలు తెలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. అడ్మిన్ భవనం ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. నినాదాలు, నిరసనలతో ప్లాంటు ప్రాంగణాన్ని హోరెత్తించారు.
ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 922 రోజులుగా కార్మికులు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థానిక పరిస్థితులను కేంద్రానికి వివరించకుండా సందర్శకుల పుస్తకంలో ఈ విధంగా రాయడం ఏమిటని మండిపడ్డారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులుఅడ్మిన్ బిల్డింగ్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులకూ, పోలీసులకూ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మరోవైపు ఉక్కుశాఖ కార్యదర్శి సిన్హాతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సమావేశమయ్యారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని కేంద్రం తన డిపిఆర్లో రాసుకుందని, వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఎక్కడ నుంచి స్టీల్ తెస్తుందని కార్మిక నేతలు ప్రశ్నించారు.
కార్మిక సంఘాలతో చర్చలు అనంతరం నాగేంద్రనాథ్ సిన్హా మాట్లాడుతూ స్టీల్ ప్లాంటులో నెలకొన్న పరిస్థితులు, ప్లాంటు బలాలు, బలహీనతలను కేంద్రానికి తెలియ జేస్తానని చెప్పారు. ముడి పదార్ధాలను సమకూర్చుకోవడంపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.