తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వామపక్షాలకు ఏకపక్షంగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా సీఎం కేసీఆర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. సొంతంగా పోటీచేసి గెలుపొందే సామర్థ్యం కోల్పోయిన వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి.
తమను వద్దనుకున్న కేసీఆర్ ఓటమి చూస్తామంటూ ప్రకటనలు చేసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు బిఆర్ఎస్ నుండి తాము ఆశించిన నాలుగు సీట్లను తమకు కేటాయిస్తే తాము పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ తో రాయబారం సాగిస్తున్నాయి. పైగా, జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా 26 పార్టీలతో ఏర్పాటు చేసిన కూటమిలో సిపిఐ, సిపిఎం కూడా భాగస్వాములు కావడంతో తెలంగాణాలో కూడా కలిసి పోటీ చేద్దాం అంటూ ప్రతిపాదనలు చేస్తున్నాయి.
తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్తో కటీఫ్ అయిన కామ్రేడ్లతో దోస్తీ చేసి.. వారి ఓట్లు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వామపక్ష నేతలతో ఏఐసీసీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే సంప్రదింపులు మొదలు పెట్టారు.
ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబిశివరావుకు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై కూనంనేని స్పష్టతఇచ్చారు. సీపీఐ పోటీ చేయాలని చూస్తున్న నియోజకవర్గాల గురించి థాక్రే దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాల్లో తమకు బలం ఉందని.. ఆ నాలుగు స్థానాలు తమకు కేటాయిస్తే.. పొత్తుకు సిద్ధమని తమ డిమాండ్ తెలిపారు.
అయితే.. అందులో మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇచ్చేందుకు సుముఖత చూపించగా, కనీసం మూడు స్థానాలైనా కేటాయించాలని కూనంనేని స్పష్టం చేశారు. దీంతో.. కాంగ్రెస్తో కామ్రేడ్ల దోస్తీ దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. కాగా, పొత్తులపై ఎలాంటి తొందర లేదని.. ఆచీతూచి నిర్ణయం తీసుకుంటామని కూనంనేని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ మిత్ర ధర్మం పాటించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గరవుతోందని ఆక్షేపించారు. తమతో కలిసి వచ్చే పార్టీలతోనే పొత్తు పెట్టుకోనున్నట్టు స్పష్టం చేశారు. మరోవంక, సిపిఎంతో కూడా పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశం ఉంది.