ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్-5 జోన్ వ్యవహారానికి, రాజధాని అంశానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవగా, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వుల తర్వాత హైకోర్టు విచారణ జరిపించింది.
విచారించాల్సిన అంశాలు చాలా ఉండటంతో తదుపరి విచారణ చేపడతామని సంజీవ్ ఖన్నా వెల్లడించారు.
ఈ దశలో ప్రతివాదులుగా ఉన్న అమరావతి రైతులకు నోటీసులు జారీ చేసి, 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం మూడువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత విచారణను నవంబర్ లో చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.