ఇండియా కూటమిలోని వారందరికి హిందూయిజం అంటే మంట, అందుకే పలు రకాలుగా ప్రేలాపనలకు దిగుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఇండియా కూటమిలోని డిఎంకెకు చెందిన స్టాలిన్ కుమారుడు ఉదయానిధి సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఇండియా బ్లాక్ వైఖరిని తెలియచేస్తుందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడి వ్యాఖ్యలు హిందూయిజానికి వ్యతిరేకం, నేరుగా దేశ ఘనమైన వారసత్వ సంపదపై దాడి అని అమిత్ షా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్లో బిజెపి ఆధ్వర్యపు పరివర్తన్ యాత్రను ఆదివారం దుంగర్పూర్ నుంచి ప్రారంభిస్తూ అమిత్ షా దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన చిలుకపలుకులు కావు, ఇండియా బ్లాక్ ఓటుబ్యాంక్ రాజకీయాలు, బుజ్జగింపుల పద్ధతులకు ప్రతీక అని స్పష్టం చేశారు.
దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు పూర్తిగా సనాతన ధర్మం ఆచరించే వారిపట్ల ఊచకోత పిలుపుగా ఉన్నాయని బిజెపి మండిపడింది. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు ఏకీభవిస్తారా? అని అమిత్ షా నిలదీశారు. డిఎంకె, కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పార్టీల పెద్దలు చివరికి వారి కుమారులు కూడా సనాతన ధర్మం అంతం గురించి ముంబై వేదికగా మాట్లాడారని అమిత్ షా తెలిపారు.
ఇది దేశంలోని కోట్లాది మందిని అవమానించినట్లే అని మండిపడ్డారు. 2010లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అతివాద హిందూ సంస్థలు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కన్నా ప్రమాదకరం అని చెప్పిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. రాహుల్ బాబా మాటలే ఇప్పుడు స్టాలిన్లు వల్లిస్తున్నారని విమర్శించారు.
ఒకరు హిందూ సంస్థలను లష్కరే తోయిబాతో పోలుస్తారు. అప్పటి హోం మంత్రి (సుశీల్కుమార్ షిండే ) చివరికి దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని అంటారు. హిందూయిజంపై వీరికి ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గొప్పదని, దీనిని విమర్శించే అర్హత ఈ నేతలకు లేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరాలుగా ప్రజల మదిలో తిష్టవేసుకుని ఉందని అంటూ మోదీ తిరిగి అధికారంలోకి వస్తే సనాతన ధర్మం మరింత పాతుకుపోతుందని ప్రతిపక్ష నేతలు చెపుతున్నారని, అయితే ప్రజల హృదయాలలో నెలకొన్న భావనలను ఎవరూ ఏమి చేయలేరని, అటు హిందూ సనాతన ధర్మాన్ని కానీ ఇటు మోదీ ఆమోదం ప్రక్రియను కానీ దెబ్బతీయలేరని తేల్చి చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపక్షాలు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడం కాంగ్రెస్కు సాధ్యం కాదని అమిత్ షా విమర్శించారు. రామాలయ నిర్మాణం పూర్తయింది. బ్రహ్మండమైన రీతిలో వెలిసిన రామాలయం జనవరిలో రాముడి జన్మస్థలిలోనే వెలుస్తుందని అమిత్ షా చెప్పారు. ఇండియా కూటమి దీనిని ఆపివేయలేదని పేర్కొంటూ ఎన్నో ఏళ్లుగా పవిత్ర రామాలయాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటూ వచ్చిందని విమర్శించారు.