దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదిగా పేరొందిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే 68 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారు. త్రినా =అనే మహిళను ఘనంగా పెళ్లాడారు. లండన్లో ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు.
వీరితోపాటు సునీల్ మిట్టల్, ఎల్ఎన్ మిట్టల్, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా, లలిత్ మోదీ, ఉజ్వల్ రౌత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
68 ఏళ్ల సీనియర్ న్యాయవాది అయిన సాల్వేకి ఇది మూడో వివాహం. సాల్వే మొదటిసారి మీనాక్షిని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల వివాహబంధానికి ముగింపు పలుకుతూ 2020లో విడాకులు తీసుకున్నారు.
ఇక అదే ఏడాది కరోలిన్ బ్రోసార్డ్ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి త్రినా అనే మహిళను పెళ్లాడారు. హరీష్ సాల్వే దేశంలో ప్రముఖమైన కేసులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ వరకూ భారతదేశ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు.
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ కేసు సహా పలు ఉన్నతస్థాయి కేసుల్లో సాల్వే న్యాయవాదిగా వ్యవహరించారు. ఈ కేసు ప్రస్తుతం ఇంటర్నేషన్ కోర్టులో ఉంది. ఈ కేసుకు గానూ సాల్వే కేవలం రూ. 1 మాత్రమే లీగల్ ఫీజుగా తీసుకొని అందరిచేతా ప్రశంసలు అందుకున్నారు.
టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసును కూడా ఈయనే వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీష్ సాల్వేకు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ భూషణ్’ని ప్రకటించింది.
