స్వేచ్ఛ, పారదర్శకతలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం దిశగా సాధించాల్సిన పురోగతి, అంతర్జాతీయ పేద దేశాల వాణిని వినిపించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇవి అవశ్యమని స్పష్టం చేస్తూ ఆసియాన్, భారత్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సి వుందని చెప్పారు.
జకార్తాలో జరిగిన ఆసియాన్ సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ 12 అంశాలతో కూడిన ప్రతిపాదనలనుసదస్సుకు అందచేశారు. అనుసంథానత, వాణిజ్యం నుండి డిజిటల్ పరివర్తన వరకు వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధికి కేంద్రంగా ఆసియాన్ వుందని, భారత్, ఆసియాన్ గ్రూపుతో కలిసి పనిచేయడానికి కట్టుబడి వుందని మోదీ చెప్పారు. ”21వ శతాబ్ద ఆసియా శతాబ్దం. ఇది మన శతాబ్దం. ఇందుకోసం, మానవాళి సంక్షేమం కోసం కోవిడ్ అనంతర కాలంలో నిబంధనల ప్రాతిపదిక వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
ఆసియాన్, భారత్లు విలువలను, ప్రాంతీయ సమైక్యతను, శాంతి, సౌభాగ్యాలను పంచుకుంటున్నాయని పేర్కొంటూ మన చరిత్ర, భౌగోళికతలు ఆసియాన్, భారత్లను కలుపుతున్నాయని పేర్కొన్నారు. బహుళ ధృవ ప్రపంచం పట్ల మనకు గల నమ్మకం కూడా మనల్ని కలిపి వుంచుతోందని చెప్పారు.
ఈనాడు అంతర్జాతీయంగా ఆనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రతీ రంగంలోనూ మన పరస్పర సహకారంలో పురోగతి సాధిస్తునే వున్నామని గుర్తు చేశారు. బహుళ నమూనాలతో కూడిన అనుసంథానతను ఏర్పాటు చేయాలని, ఆగ్నేయాసియా, భారత్, పశ్చిమాసియా, యూరప్లను అనుసంథానిస్తూ ఆర్థిక కారిడార్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఆసియా భాగస్వామ్య దేశాలతో భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవాల్సి వుందని చెప్పారు. తీవ్రవాదంపై, తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించడంపై, ఆన్లైన్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై సమిష్టి పోరాటం జరపాలని ప్రధాని పిలుపిచ్చారు. వివిధ రంగాల్లో పేద, వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు.
సముద్ర జలాల సహకారంపై, ఆహార భద్రతపై రెండు సంయుక్త ప్రకటనలు సదస్సులో ఆమోదించారు. డిజిటల్ పరివర్తన, ఆర్థిక అనుసంథానత రంగాల్లో సహకారంపై దృష్టి కేంద్రీకరించేందుకు ఆసియాన్-భారత్ నిధిని ఏర్పాటు చేయడం కూడా మోదీ చేసిన ప్రతిపాదనల్లో వుంది. ఆసియాన్, తూర్పు ఆసియా ఆర్థిక పరిశోధనా సంస్థను పునరుద్ధరించేందుకు మద్దతునివ్వడంపై ప్రకటన చేయాలని మోదీ కోరారు.