లోక్సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.
మాండ్యా, హసాన్, బెంగళూరు(రూరల్), చిక్బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2019లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా, కేవలం హసాన్లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవే గౌడ తుమ్కూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక దేవెగౌడ మనువడ, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో జేడీఎస్ 10 శాతం కంటే తక్కువ ఓటు షేరును పొందింది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 14 శాతం ఓట్లకే పరిమితమైంది.
ఈ పరిస్థితుల్లో బీజేపీతో అవగాహన జేడీఎస్కు కీలకమవబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జేడీఎస్తో అవగాహన బీజేపీకి కూడా చాలా కీలకమవబోతోంది. కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమికి గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ ఇప్పటికే యోచిస్తున్న విషయం తెలిసిందే.
కర్ణాటకలో మే నెల వరకు బీజేపీ అధికారంలోనే ఉంది. అయితే 224 సీట్లలో ఏకంగా 135 సీట్లలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ సీట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది. అందులో భాగంగానే జేడీఎస్తో అవగాహన కుదుర్చుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇప్పటికే మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డి దేవెగౌడ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో మంతనాలు జరిపినట్లు యడ్డ్యూరప్ప వెల్లడించారు.