ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో 2000 మందికి పైగా మృతి చెందారు. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. వేలసంఖ్యలో గాయపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్కు నైరుతి దిశగా 71 కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.8 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్హౌజ్ ప్రావిన్స్ లోని ఎల్ఘిల్ నగరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. 18 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైంది.
అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి వణికిపోయాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అకస్మాత్తుగా భవనాలు ధ్వంసం కావడంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. మృతదేహాలు, కుప్పకూలిన భవనాల శిథిలాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానక వాతావరణం కన్పిస్తోంది.
కొన్ని భవంతులు కూలకపోయినా వాటికి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాలలో మహిళలు, చిన్నారులు సహా ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో కాలక్షేపం చేశారు. కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న అనుమానంతో ప్రజలు తిరిగి తమ నివాసాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఇప్పటి వరకూ ఇలాంటి భారీ భూకంపం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది.
‘భూమి కంపిస్తోన్న సమయంలో నిద్రలో ఉన్నాం. గాల్లోకి ఎగిరిపోతున్నట్టు మాకు అనిపించింది. దాంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకుపరిగెత్తాము. మా ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో నిండిపోయింది’ అని మర్రాకేశ్ స్థానికులు వాపోయారు.
మర్రాకేశ్లో 12వ శతాబ్దంలో నిర్మించిన ప్రఖ్యాత కౌటోబియా మసీదు బాగా దెబ్బతింది. 226 అడుగుల ఎత్తున ఉన్న బురుజు వంటి నిర్మాణం దెబ్బతింది. పాత నగరం చుట్టూ ఉన్న ప్రాచీన గోడలు దెబ్బతినడంతో వాటి దృశ్యాలు మొరాకో ప్రజలు పోస్ట్ చేశారు. మర్రాకేశ్ నగరం మాత్రం బారీగా ధ్వంసమైంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అల్ హౌజ్ ప్రావిన్స్లో రోడ్లపై శిధిలాలను అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు. కొండప్రాంతమైన ఈ ప్రావిన్స్లో అనేక గ్రామాలు కొండలకు ఆనుకుని ఉన్నాయి. మిలిటరీ, ఎమర్జెన్సీ బృందాలు రంగం లోకి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.
ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలో కనిపించింది. శనివారం ఉదయం మర్రాకేశ్ నగరంలో వ్యాపారాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. టూరిస్టులు, ప్రజలు రాకపోకలు తిరిగి ప్రారంభించారు. శతాబ్ద కాలంలో ఉత్తరాఫ్రికాలో ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 1960లో మొరాకోలోని అగాదిర్ నగరం సమీపంలో భూకంపం సంభవించి వేలాది మంది మరణించారు.