తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు , ఏఐటియుసి, ఐఎఫ్టియు మూడు సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన ‘చలో విజయవాడ’ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ ధర్నా చౌక వద్ద అంగన్వాడీలు సోమవారం సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు.
బలవంతపు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ అంగన్వాడీల ధర్నాను భగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి రైల్వే స్టేషన్లు, బస్టాండుల నుండి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలో గుజ్జుల సరళా దేవి కళ్యాణ మండపంలో 150 మందిని, సింగ్నగర్ వడ్డెర కళ్యాణమండపంలో 100 మందిని, కండ్రిక లగడపాటి రాజగోపాల్ కళ్యాణ మండపంలో వందమందిని, ఆటోనగర్ టెక్నీషియన్ హాల్లో 50 మందిని, నక్షత్ర కన్వెన్షన్ లో 100 మందిని విజయవాడ ధర్నా చౌక్ నుండి 80 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు.
ఈ నిర్బంధ చర్యలను సిఐటియు ఖండించింది. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో కొంతమంది అంగన్వాడీలు మారువేషాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద పోలీసులు నెట్టివేయడంతో ఓ అంగన్వాడీ సొమ్మసిల్లిపోయారు. పోలీసులు దిగ్బంధనాలను దాటుకుంటూ తాము నిరసన చేపడతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
అంగన్వాడీల అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలను అరెస్టులు చేయడం దుర్మార్గమని, ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ ప్రజాతంత్ర వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలని కోరారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నాలుగేళ్లుగా హామీలు అమలు చేయకపోగా, బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.