స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్ను అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో లోకేశ్ కు స్వల్ప ఊరట దక్కినట్లు అయింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లోకేశ్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవంక, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది.
అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంపై 2022 ఏప్రిల్లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. దీంతో సిఐడి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్కు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి సురేష్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు నారా లోకేష్కు నోటీసులివ్వడానికి సిఐడి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి. దీంతో సిఐడి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు సహకరించాల్సిందేనంటూ లోకేష్కు కోర్టు తేల్చి చెప్పడంతో తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.