‘ఆపరేషన్ అజయ్’ అనే పేరుతో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ కు మద్ధతుగా నిలిచింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ భారత ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధ పరిస్థితులను వివరించారు.
విదేశీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ కు తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను వెనక్కు తీసుకువస్తున్నారు. అందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ట్వీట్ చేశారు.
ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. గతంలో ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టిన సంగతి తెలిసిందే.
గురువారం బయల్దేరే ప్రత్యేక విమానంలో భారత్ కు రానున్న భారతీయులకు మెయిల్ లో సమాచారం ఇచ్చామని టెల్ అవీవ్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్ లోని భారతీయులకు అవసరమైన సహాయ, సదుపాయాలు అందించడం కోసం 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ను భారత విదేశాంగ శాఖ ఏర్పాటు చేసింది.
అలాగే, ఇజ్రాయెల్ లోని భారతీయ ఎంబసీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్స్ ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం గురువారానికి ఐదవ రోజుకు చేరింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ వార్ టైమ్ కేబినెట్ ను ఏర్పాటు చేసి, యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
గాజాపై రాకెట్ల వర్షాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. హమాస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. భవనాలు కుప్పకూలాయి. మరణాల సంఖ్య తెలియడం లేదు. మొత్తంగా గాజా శిధిల నగరంగా మారింది. గాజా వైపు నుంచి కూడా హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్లను ప్రయోగిస్తోంది.