ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం “మేరా యువభారత్ ” “మై భారత్” పోర్టల్ను ప్రారంభించారు. 21వ శతాబ్దం జాతి పునర్నిర్మాణంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. మేరా మాటీ మోరా దేశ్ అమృత్ కలశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ పోర్టల్ను ఆయన ప్రారంభించారు.
ఢిల్లీ లోని కర్తవ్య పథ్లో మేరీ మాతీ మేరా దేశ్ అమృత కలశ్ యాత్ర ముగింపు యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోడీ భారత్ కలశ్లో ఉంచారు. కలశ్ లోని మట్టిని ఆయన తన నుదుట తిలకంగా దిద్దుకున్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన మట్టితో ఇండియా గేట్ సమీపాన అమృత్ మహోత్సవ్ స్మారక్ అమృత్ వాటిక నిర్మాణం కానుంది. రానున్న తరాలు ఈ ఈ స్మారక ఉద్యానవనం ద్వారా ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు.
దేశ ప్రజలను ఏకం చేసిన ‘మేరీ మాటీ మేరా దేశ్’
ప్రజల్లో దేశ భక్తి భావనను జాగృతం చేయడంతో పాటు.. అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం దేశ రాజధానిలో ‘మేరీ మాటీ మేరా దేశ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన మేరా మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో 6 లక్షల గ్రామాలు, కోట్ల ఇండ్లనుంచి అమృత కలశాల్లో, మట్టి, బియ్యాన్ని పంపించడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో.. పలు ప్రపంచ రికార్డులు నమోదవడం.. వివిధ అంశాలను కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, బిజెపితో సహా వివిధ పార్టీల ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, దేశ నలుమూలలనుంచి ఆయా ప్రాంతాల నుంచి అమృత కలశాల్లో మట్టిని ఢిల్లీకి తీసుకొచ్చిన 75 వేల మంది యువకులు కూడా పాల్గొన్నారు.
