కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళలో వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. కేరళలో ఇటీవలే జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో వివిధ మతాల మధ్య విధ్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేరళ పోలీసులు రెండు రోజుల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చేయగా, అదే అంశంలో తాజాగా మరో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా ద్వారా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాజాగా రెండో కేసు నమోదైంది. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్ పీ సారిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఇదే ఘటనపై కేంద్ర మంత్రిపై రెండో కేసు నమోదు చేశారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరి లోని ‘జెహోవా విట్నెసెస్’ అనే క్రైస్తవ మత గ్రూపు ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. కన్వెన్షన్ హాలులో ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లు జరిగాయి.
ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 51 మంది గాయపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులు రెచ్చిపోతుంటే విజయన్ సర్కారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
మరోవైపు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ఇంటర్నెట్లో చూసి బాంబుల తయారీ నేర్చుకున్నట్టు తెలిపాడు. ఈ బాంబుల తయారీకి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే వెచ్చించినట్టు 48 ఏండ్ల డామినిక్ మార్టిన్ చెప్పాడు.