పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు.
ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళతామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామని తెలిపారు. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశామని చెబుతూ రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయని, డీబీటీ నాన్డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామని సిఎం జగన్ చెప్పారు.
” ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా ? కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా ? ” అంటూ సిఎం జగన్ ఎద్దేవా చేశారు.
సొంత కుటుంబంలో సొంత కూతురిని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు రాష్ట్రంలో కోటి 50లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? అని జగన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో మారాను అని చెబితే నమ్మగలమా? అని నిలదీశారు. ఎన్టీరామారావు పరిస్థితి అదే అయితే మనలాంటి వారి పరిస్థితి ఏమిటని సిఎం జగన్ ప్రశ్నించారు.
31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ”మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. పొత్తులను మేం నమ్ముకోలేదు. నా ధైర్యం ప్రజలు.. అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదు ” అని సిఎం జగన్ స్పష్టం చేశారు.