గత కొన్ని నెలలుగా అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి ఎట్టకేలకు బిజెపికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాజీనామా లేఖ పంపారు.
ఇటీవలే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిగా , తుల ఉమ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా తాజాగా విజయ శాంతి సైతం వారి బాటలోనే పయానించింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించింది.
రెండు, మూడు నెలలుగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జెపి నడ్డా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో జరిగిన బహిరంగసభలు సహితం ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన అజిటేషన్ కమిటీ చైర్మన్గా పార్టీ నియమించినప్పటికీ చైర్మన్ హోదాలో కూడా ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ముందుకు రాలేదు. వారం రోజుల కితం బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు. వెంటనే పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారడంతో రాత్రి 10 గంటలకు స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించారు. అయిన ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తప్పించినప్పుడు పార్టీలో జాతీయ స్ధాయి పదవి ఇస్తారని ఆమె ఊహిస్తే ఎలాంటి పదవి రాకపోవడంతో ఆప్పటి నుంచి విజయశాంతి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు బీజేపీ రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరూ తెలంగాణ ప్రజలే
ఇలా ఉండగా, ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదేనని ట్విట్టర్ వేదికగా విజయశాంతి పేర్కొన్నారు. తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరని అది ఎప్పటికీ నిరూపితమైన వాస్తవమని అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలని ఆమె తెలిపారు.
ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాడిన కట్టడం ఎంతమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నదని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవమని ఆమె పేర్కొన్నారు.
పార్టీల ప్రయోజనాలు వేరు ప్రజా ప్రయోజనాలు వేరు ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి అని ఆమె చెప్పారు.
అందుకే, కోవిడ్ కష్టకాలంలో, ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్లో వస్తున్న ఆంధ్ర ప్రాంత వైద్య అవసర బాధితులు హైదరాబాద్ హాస్పిటల్స్కు రాకుండా, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలియక పోలీసులు అడ్డుకున్నప్పుడు, వారిని తక్షణం వదలకుంటే, ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని చెప్పినది రాములమ్మేనన్న జ్ఞాపకం ఇప్పటికీ అందరికీ సజీవమేనని ఆమె గుర్తు చేశారు.