ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని శుక్రవారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద హమాస్ నుంచి 25, ఇజ్రాయల్ నుంచి 39 మంది విడుదల అయ్యారు.
ఇరువైపులా విడుదలైన వారిలో అందరూ మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలు దేశానికి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారికి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది.
ఈ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. ఒప్పందంలో లేకున్నా 10 మంది థాయ్ జాతీయులు, ఒక ఫిలిప్పీన్స్ దేశస్థుడిని హమాస్ విడిచిపెట్టింది.
దీంతో మొత్తం 24 మందికి హమాస్ స్వేచ్ఛ ప్రసాదించినట్టు అయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఖతర్ బందీల విడుదలను నిర్ధారించింది. రెడ్క్రాస్ సంస్థ ద్వారా బందీల విడుదల సజావుగా సాగింది. హమాస్ చెర నుంచి బందీలు తిరిగి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
నాలుగు రోజుల కాల్పుల విరమణ నేపథ్యంలో మానవతా సాయం కూడా గాజా స్ట్రిప్లోకి ప్రవేశించడం ప్రారంభమైంది. కాల్పుల విరమణ ప్రారంభమైన వెంటనే నాలుగు ఇంధన ట్యాంకర్లు, వంట గ్యాస్తో మరో నాలుగు ట్యాంకర్లు ఈజిప్టు నుంచి గాజాకి వచ్చాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఆహారం, నీళ్లు, ఔషధాలు వంటి అత్యవసర సామాగ్రితో కూడిన ట్యాంకర్లలో రోజుకు 196 ట్రక్కుల చొప్పున ఈ నాలుగు రోజుల్లో గాజా, వెస్ట్ బ్యాంకుకు రవాణా కానుందని వెల్లడించింది. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి గాజాకు చేరుతున్న అతిపెద్ద సాయం ఇదేనని పేర్కొంది.