టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అలాగే యూపీఏ నుంచి ‘ఇండియా’ అని మార్చుకున్నంత మాత్రాన వారి తీరు మారదని పేర్కొంటూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కామన్ పాయింట్ అవినీతి అని ధ్వజమెత్తారు.
కామారెడ్డిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఏటీఎం వద్దకు వెళ్తారని, కానీ బిఆర్ఎస్ మాత్రం కొత్త నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతుందని విమర్శించారు. బిఆర్ఎస్కు డబ్బులు అవసరమైతే కొత్త పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బు బిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.
తెలంగాణ వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల్లో ఆశలు కనిపిస్తున్నాయని, ఇది మార్పుకు నిదర్శనమని చెబుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ, అవినీతి పాలనకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ అని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని మాట ఇచ్చామని దానిని నిలబెట్టుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.
కేంద్రంలో తనలాంటి ఓ బీసీని ప్రధానిగా చేసిన ఘనత బిజెపిదే అని చెప్పారు. బిజెపి మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుందని పేర్కొంటూ కేంద్ర కేబినెట్లో అత్యధికమంది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. కానీ దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కెసిఆర్… ఆ హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని ప్రధాని తెలిపారు. బిజెపి చెప్పింది చేసి తీరుతుందని అంటూ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రైతులకు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్, రామమందిర నిర్మాణం… ఇలా ప్రతి హామీని నిలబెట్టుకున్నామని మోదీ వివరించారు.
తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజనులకు యూనివర్సిటీ వంటి తదితర హామీని కూడా నిలబెట్టుకున్నామని చెబుతూ తెలంగాణను బిఆర్ఎస్ నుంచి విముక్తి కలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. బిసిలకు, దళితులకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై యువత చాలా కోపంతో ఉందని చెప్పారు. ఆ రెండు పార్టీలు బీసీలకు, దళితులకు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.
కామారెడ్డి నుంచి సిఎం కెసిఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని చెబుతూ వీరిద్దరూ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రెండుచోట్ల పోటీ చేస్తున్నారంటే వారిలోని నిరాశ మనకు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
పేదల కోసం పని చేసే పార్టీ బిజెపి మాత్రమే అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజవర్గానికి తీరని అన్యాయం జరిగిందని చెబుతూ వారికి న్యాయం చేసే బాధ్యతను బిజెపి తీసుకుందని చెప్పారు. మాదిగల సాధికారతకు కోసం మేం కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నామని హామీ ఇచ్చారు.
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని, అక్కడ మీకు న్యాయం జరిగేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నిన్న తాను అధికారులతో మాట్లాడానని, ఇప్పటికే కమిటీ ప్రకటించామని, వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.