సిగరెట్లు, బీడీలు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహిత మాచన రఘునందన్ తెలిపారు. సిగరెట్ల తో పాటు బీడీలు,ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని, హెల్త్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది.
ఈ విషయమై మాట్లాడుతూ.. హెల్త్ టాక్స్ విధింపు,పెంపు అనే నిర్ణయాలతో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులను పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాతంలో అరకిలోమీటరు వరకు విక్రయించకుండా ఆంక్షల్ని విధించి, అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఆయన అభ్యర్ధించారు.
“ప్రధాని నరేంద్ర మోదీ బాలలతో, విద్యార్థులతో కలివిడిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న విషయం దృష్టి లో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీ లు ఉన్న చోట అర కిలోమీటర్ దూరం వరకు పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయం పై నిషేధం విధిస్తే భవిష్యత్ భారతం ఎంతో వికసిస్తుంది. చారిత్రాత్మమైన నిర్ణయం అవుతుంది” అని తెలిపారు.
హెల్త్ టాక్స్ పెంపు ఆహ్వానించదగ్గ పరిణామమే, హర్షణీయమే పేర్కొంటూ సిగరేట్ పాకెట్లను కాకుండావిడిగా విక్రయిస్తే పన్ను మరింత పెంచితే యువత ధూమపానంకు దూరంగా ఉండే అవకాశం ఉందని రఘునందన్ సూచించారు. ఇరవై ఏళ్లుగా పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్న ఆయన పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకునే నిర్ణయం ఆరోగ్య భారతానికి దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.