నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు నాగార్జున సాగర్ డ్యాంకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్, తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ పోలీసులకు డ్యాం భద్రతా బలగాలకు, తెలంగాణ పోలీసులు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు యత్నం చేశారు. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ముళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్ చేశారంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి.
సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.
డ్యామ్లో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో దాదాపు 700మంది పోలీసులు సాగర్ డ్యామ్పైకి చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.
తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా వివాదాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. రెండు దేశాలే నీటి సమస్య పరిష్కరించు కుంటున్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సాధ్యం కాదా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.