కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జల్శక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపనున్నది.
ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం వీడియో సమావేశం జరిపారు.
అయితే, తెలంగాణ సీఎస్ సమావేశానికి హాజరుకాలేనని.. సమావేశం తేదీ మార్చాలని కోరగా, ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెబుతూ అప్పటి వరకు రెండు రాష్ట్రాలు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.
అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంట్పై ఈ నెల 4న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్కు జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు.
కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని, అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.