ఆప్ ఎంపి రాఘవ్ ఛద్దా సస్పెన్షన్ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా ఎత్తివేశారు. తర్వాత సోమవారం నుంచి ఆరంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించారు. సభాహక్కుల కమిటీ సమావేశం అయ్యింది. ఇందులో రాఘవ్ను తప్పుచేసిన వాడిగానే నిర్థారించారు.
ఆయన మీడియాకు తప్పుడు సమాచారం, గణాంకాలు అందించారని ఇది తమ పరిశీలనలో రుజువు అయింని తెలిపారు. ఇతరత్రా కూడా రాజ్యసభ కమిటీ ఆయన తప్పిదాలను పేర్కొంది. సోమవారం సభలో ఆయన సెస్పెన్షన్ ముగింపు తీర్మానాన్ని బిజెపి సభ్యులు జివిఎల్ నరసింహరావు ప్రతిపాదించారు. దానిని సభ మూజువాణితో ఆమోదం తెలిపింది.
ఇప్పటికే ఆయన సస్పెన్షన్కు గురై ఉన్నందున దీనినే ఆయన అనుచిత వ్యవహారానికి శిక్షగా భావించి వదిలివేయాలని సభ్యులు తీర్మానంలో సూచించారు. తీర్మానానికి ముందు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ రాఘవ్ ఛద్దా రెండు అభియోగాలతో దోషి అని తేలిందని, దీనికి ముందు పూర్తి స్థాయి విశ్లేషణాత్మక పరిశీలన జరిగిందని తెలిపారు.
సెలెక్ట్ కమిటీ సభ్యులుగా కొందరి పేర్లను చేర్చడానికి ముందు ఈ ఎంపి వారి అనుమతి తీసుకోవలేదని, ఇది సభా నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని గమనించామని సభాధ్యక్షులు తెలిపారు. ”ప్రత్యేక హక్కుల ఉల్లంఘన” ఆరోపణలపై రాజ్యసభ రాఘవ్ చద్దాపై ఈ ఏడాది ఆగస్టు 11 నుండి 115 రోజులపాటు సస్పెండ్ విధించింది.
ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ అధ్యయన కమిటీ సభ్యులుగా వారి అనుమతి లేకుండానే అధికార బిజెపికి చెందిన ఇద్దరు సహా నలుగురు రాజ్యసభ ఎంపిలను ప్రతిపాదించేందుకు చద్దా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు బిజెపి ఆరోపించింది.