ఐదు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారని, దేశం మొత్తం విస్తుపోయేలా రూ.351 కోట్లు దొరికాయని పేర్కొంటూ ఈ నోట్ల కట్టలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించరే అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతూ చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని నిలదీశారు. ఇప్పటి వరకు 40కి పైగా సంచులు లెక్కపెట్టారని, ఇంకా 90కి పైగా సంచులు లెక్కపెట్టాల్సి ఉందని పేర్కొంటూ దేశంలో ఇప్పటివరకు ఇంతపెద్ద మొత్తంలో నగదు దొరికిన దాఖలాలు లేవని, ఆ డబ్బును లెక్కపెట్టేందుకు కౌంటింగ్ మిషన్స్ కూడా సరిపోవడం లేదని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.
ఎలక్షన్ కమిషన్కి ధీరజ్ సాహు చూపించిన ఆస్తి చాలా తక్కువ అని, దాడుల్లో మాత్రం లెక్కపెట్టలేనంత సంపద దొరకడం చూస్తే ఎంత అవినీతి చేస్తున్నారో అర్థమవుతోందని తెలిపారు. అతని వద్ద ఉన్న దస్తావేజులు అక్కడ ఉన్న ఆస్తులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందని స్పష్టం చేశారు. ధీరజ్ సాహుకు రాంచీలోని 8 బ్యాంకుల్లో 7 కు పైగా లాకర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడుసార్లు రాజ్యసభకు ఎన్నుకున్నారని ఆయన వెల్లడించారు. ధీరజ్ సాహుపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న పలువురు గతంలో అవినీతికి పాల్పడి తీహార్ జైల్లో ఉన్నారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తనిఖీల్లో లభ్యమైన డబ్బంతా పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్కు, అవినీతికి విడదియలేని బంధం ఉందని, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దేశ ఆర్థిక వ్యవస్థను చెదలు పట్టినట్టుగా తొలుస్తుందని ఆయన విమర్శలు చేశారు.