ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమం డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు చరిత్రాత్మక నిర్ణయం తెలిపారు.
విద్య, ఆరోగ్యం ప్రజలకు ఒక హక్కుగా లభించాలని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకు వైద్యం ఉచితంగా లభిస్తుంద, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని వివరించారు.
ఈ నెల 19 నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆరోగ్య శ్రీ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతోందని చెప్పారు. జనవరి నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలని సీఎం ఆదేశించారు.
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారు మళ్లీ చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలని చెప్పారు.