ప్రతిపక్షాలకు తరచూ ఏదో విధంగా పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడమే పని అయిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. విపక్షాలు చివరికి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనను కూడా రాజకీయం చేస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని సభలకు అడ్డుతగులుతోందని ఆయన విమర్శించారు.
శీతాకాల పార్లమెంట్ సెషన్లో ఇప్పటి పరిణామాలపై ఆయన స్పందించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి కూడా అయిన ఠాగూర్ ఢిల్లీ లోని నజాఫ్ఘర్లో ఓ స్కూల్లో జరిగిన గ్రామీణ క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో ఓటమి తరువాత కాంగ్రెస్కు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఏదో విధంగా సభలను అడ్డుకోవడం ద్వారా తమ పరాజయం గురించి పలువురికి తెలియకుండా చేసుకోవాలనుకుంటున్నారని, దీనితో పార్లమెంట్ పరిణామాలను సాకుగా తీసుకుని ఇప్పుడు రాద్ధాంతానికి దిగుతున్నారని విమర్శించారు.
దేనిని రాజకీయం చేయకుండా వదిలిపెట్టరాదనేదే ప్రతిపక్షాల అరాచక పద్ధతి అయిందని ప్రధానంగా సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించే ఈ మంత్రి మండిపడ్డారు. అంతకు ముందు శుక్రవారం ఉభయసభలు భద్రతా వైఫల్యాలపై సర్కారు తీరును ఎండగడుతూ నిరసనలకు దిగుతూ ఉండటంతో అర్థాంతర వాయిదాలకు దారితీసిన నేపథ్యంలోనే మంత్రి స్పందించారు.