విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ దళిత నేత అయిన మల్లిఖార్జున్ ఖర్గే మంగళవారం ఢిల్లీలో జరిగిన భేటీలో తెరపైకి రావడంతో రాజకీయంగా కలకలం చెలరేగింది. ఆయన పేరును పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడంతో కాంగ్రెస్ వర్గాలే అనిశ్చిత పరిస్థితికి లోనయ్యాయి.
అయితే, ఆ ప్రతిపాదనపై ఖర్గే స్పందిస్తూ “ఇప్పుడు గెలవడం ముఖ్యం కానీ, పీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు’’ అని స్పష్టం చేశారని సమాచారం. “కూటమి సమావేశంలో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. సీట్ల పంపకం, ప్రచార కార్యక్రమంపై చర్చ జరిగింది. మరో 20 రోజుల్లో దీనిపై కార్యాచరణ వెల్లడవుతుంది’’ అని ఆ సమావేశంలో పాల్గొన్నఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వెల్లడించారు.
ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. తమ వ్యూహాలను ఏ విధంగా మార్చుకోవాలనే విషయంలో కూటమి నేతలు చర్చించారు. అలాగే, కూటమిలోని పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సీట్ల పంపకంపై కూడా చర్చించారు.
సీట్ల సర్దుబాటు విషయంలో కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి జఠిలమైన రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని సమావేశం నిర్ణయించింది.
సీట్ల షేరింగ్, కలిసికట్టుగా జనాల్లోకి వెళ్లే కార్యాక్రమాలు 20 రోజుల్లో ప్రారంభించి, మూడు వారాల్లో వీటిపై నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశానికి కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితర 28 పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పార్లమెంటు నుంచి 142 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఇండియా కూటమి ఖండించింది. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమంటూ తీర్మానం చేసింది. పార్లమెంటులో దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మోదీ ప్రజాస్వామ్యాన్ని మోదీస్వామ్యంగా మార్చారని ఆ తీర్మానం తప్పుపట్టింది.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా సభకు హాజరై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంతమంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంలో పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఎంపీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయించింది.
