బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం మూడు బిల్లులకు దిగువసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.
నూతన బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ఆయన ప్రకటించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి చెప్పారు. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే.. తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తెచ్చామని వివరించారు.
తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి కఠినశిక్ష పడాల్సిందేనని అమిత్ షా తేల్చి చెప్పారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారిని శిక్షించరాదన్న హోంమంత్రి అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. సీఆర్పీసీలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు చెప్పారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా వివరించారు.
కాగా, లోక్సభలో ఆమోదం పొందిన భారతీయ న్యాయ(రెండో) సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా (రెండో) సంహిత, భారతీయ సాక్ష్య(రెండో) బిల్లులను రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది.
ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి డిసెంబర్ 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, పార్లమెంటులో ఇప్పటికే 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్సభ ఆమోదించడం గమనార్హం.