ప్రముఖ తెలుగు
కథా, నవలా రచయిత తల్లవజ్జుల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2023 ఏడాదికి సంబంధించి 24 భాషల సాహితీకారులను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేశామని అకాడమీ కార్యదర్శి శ్రీనివాస రావు బుధవారం ప్రకటించారు.
తెలుగులో ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ రచనకు గాను తల్లవజ్జుల పతంజలి శాస్త్రికి ఈ అవార్డు అందిస్తున్నట్టు తెలిపారు. 1945లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించిన పతంజలి ఒంగోలులో విద్యనభ్యసించారు.
పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా పనిచేసిన ఆయన పతంజలి శాస్త్రి కథలు, వడ్ల చిలుకలు, నలుపెరుపు లాంటి కథా సంపుటాలు వెలువరించారు. రాజమండ్రిలో పర్యావరణ సెంటర్ను నిర్వహించారు.