ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
ఆ విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానిని కోరినట్టు చెప్పుకొచ్చారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరినట్టు భట్టి వివరించారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని, అందులో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినట్టు పేర్కొన్నారు.
వాటితో పాటు ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా అడిగినట్టు చెప్పారు. నేషనల్ హైవేస్ అథారిటీకి సంబంధించి 14ప్రతిపాదనలు అప్గ్రేడ్ కోసం పెండింగ్లో ఉన్నాయని, వాటి కూడా వెంటనే మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటికి సైతం వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసినట్టు భట్టి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యిందని, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని వివరించినట్టు తెలిపారు. అయితే, అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా.. తాము చర్చించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.