అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏయే కార్యక్రమాలు చేస్తోంది? ఏయే పథకాలను అమలు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రచార రథాలు ఊరూరా తిరుగుతున్నాయని చెప్పారు.
ఈ యాత్ర సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అర్హులైన వారంతా ఆయా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా? లేదా? లబ్దిదారులున్నారా? లేరా? ఏయే అభివ్రుద్ధి పనులు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, జీరో అకౌంట్, సుకన్య సమ్రుద్ధి యోజన, ముద్ర రుణాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఎంతకాష్ఠ పడినా రైతుకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం రావడం లేదని చెబుతూ అందుకే కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడమే కాకుండా పంట దిగుబడి ఎట్లా పెంచుకునేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు.
ఇక్కడున్న యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఎన్నో స్కిల్డ్ డెవెలప్ కార్యక్రమాలను అమలు చేస్తోందని, టెక్నాలజీలో దూసుకుపోతున్న యువతలో ఎవరైనా సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలనుకుంటే కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు. యువతకు వాటిపై అవగాహన కల్పించాలని కోరారు.
అట్లాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, మాతృ వందన స్కీం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం వంటి పథకాలకు సంబంధించి అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు నమోదు చేసుకోని.. వాటి ద్వారా లబ్ధి పొందని వారికి ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న అధికారులందరినీ కోరారు.
మాతృ వందన స్కీం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర పధకాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని కోరారు. అందుకోసం ప్రత్యేకంగా రథాలను, ప్రచార సామాగ్రిని కేంద్రం మీకు పంపించిందని చెబుతూ ఎల్ఈడీ రథాలు ఊరూరా తిరుగుతూ పోస్టర్లు, కరపత్రాల ద్వారా కేంద్ర పథకాలను ఇంటింటికీ తెలపాలని వివరించారు.
కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అంతిమ లక్ష్యం ఒక్కటేనని, అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలని, మారుమూలన ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. తద్వారా భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్ది విశ్వగురుగా మార్చాలన్నదే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు.