ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి డుమ్మా కొట్టారు. ఈ మేరకు విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికి మూడు సార్లు నోటీసులు ఇచ్చింది.
ఇందులో భాగంగా ఈ నెల 3న (బుధవారం) కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాజాగా తాను విచారణకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన సీఎం.. ముచ్చటగా మూడోసారి కూడా డుమ్మా కొట్టారు.
వరుసగా నవంబర్ 2, డిసెంబర్ 21 సమన్లకు ఆయన గైరజరయ్యారు. మరోవైపు ఈడీ సమన్లపై ఆప్ తీవ్రంగా స్పందించింది.
ఈ నోటీసులు అక్రమమని, తమ సుప్రిమోను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయితే, దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని తెలిపింది.
ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారు? అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నోటీసులు పంపారని ఆరోపించింది.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్ను విచారించిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్లో ఆయనను ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. అక్టోబర్లో అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2న రెండోసారి సమన్లు పంపింది.
ఈ రెండుసార్లు సైతం ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానన్న ఆయన.. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో ఈడీ మూడోసారి నోటీసులు పంపింది. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదంటూ సమాచారం ఇచ్చారు.