త్వరలోనే టిడిపికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అధికార పక్షం వైసిపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
శనివారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ”టిడిపికి త్వరలో రాజీనామా చేస్తున్నాను. లోక సభ స్పీకర్ అనుమతి కోరాను. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా” అని వెల్లడించారు.
ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు. గాంతంలోనే నాని వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని కొందరు వైసిపి నేతలు ప్రకటనలు జారీ చేశారు. నియోజకవర్గంలోని వైసిపి నేతలతో కొంతకాలంగా ఆయన సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గం అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదని, అందరిని కలుపుకు పోవాలంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతినిధులు కలిసి వచ్చే ఎన్నికలలో పార్టీ సీటు ఇవ్వబోవడం లేదని చెప్పారని, తనను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దానితో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి టిడిపి సీటు ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
తన అవసరం లేదని చంద్రబాబు భావించారని.. ఈ సమయంలో తాను ఇంకా టిడిపిలో కొనసాగడం కరెక్ట్ కాదని నాని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును వేరే వ్యక్తికి ఇస్తామంటూ తనకు తెలుగుదేశం అధిష్ఠానం వర్తమానం పంపడంపై నాని శుక్రవారం నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.
“నేను వద్దని చంద్రబాబు అనుకున్నారు. నేను అలా అనుకోలేదు. విజయవాడ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాను. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ది చేశాను. అలాంటి నేను ఖాళీగా ఉంటే అభిమానులు ఊరుకుంటారా?” అని ఎదురు ప్రశ్నించారు.
ఏదిఏమైనా మూడోసారి విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధించడం ఖాయమని కేశినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ప్లైట్ చూసుకోవాలి కదా? అంటూ పార్టీ మార్పుపై నర్మగర్భంగా మాట్లాడారు. 2024 మే వరకూ తానే ఎంపీనని పేర్కొంటూ తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని నాని చెప్పారు.