శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అలంకరణలతోపాటు సంప్రదాయం ఉట్టిపడుతూ, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు.
అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. పుష్పాధివాసం పూజల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చక్కెర, పూలను శనివారం బాల రామునికి సమర్పించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి 81 కలశాల్లో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో బాల రాముని విగ్రహాన్ని, గర్భగుడిని సంప్రోక్షణ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలరాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించనున్నారు. అయోధ్యలో ఎక్కడా చూసినా.. ఆధ్యాత్మికశోభ కనిపిస్తోంది. రంగవళ్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య కళను సంతరించుకుంది. రామమందిరం ప్రారంభోత్సవానికి అయోధ్యకు వేలాది సాధువులు చేరుకుంటున్నారు.
దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన సాధవులకు తీర్థ క్షేత్రపురంలో బస ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు, అతిథులు కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ పూజలో ‘యజమానులు’గా సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాలవారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి యజమానుల ఎంపిక జరిగింది.
అయోధ్యలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి. రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రామ్ పథ్లో గురువారం ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్లు, సైనేజెస్లో రామాలయం బొమ్మను ముద్రించాయి.
బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన పోస్టర్లో ‘ప్రభు శ్రీరాముని పావన నగరానికి స్వాగతం’ అని రాశారు. సాధారణ ప్రజానీకం కూడా తమ మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లుగా రాముని పాటలనే పెట్టుకుంటున్నారు. రామాలయానికి వెళ్లిన రోజునే దర్శనం, హారతి కోసం బుక్ చేసుకోవచ్చు.
అయితే స్లాట్ లభ్యతనుబట్టి పాస్ ఇస్తారు. హారతి షెడ్యూలు సమయానికి 30 నిమిషాల ముందు భక్తులు క్యాంప్ ఆఫీస్ వద్ద హాజరుకావాలి. హారతి పాస్లను పొందడం కోసం ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఐడీ కార్డులను చూపించాలి. బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ను తీసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
ఆహ్వానితులకు వాట్సాప్ ద్వారా ఓ లింక్ను పంపించినట్లు తెలిపింది. ఫిజికల్ ఎంట్రీ పాస్ ప్రింట్ చేసి ఇస్తామని తెలిపింది. దీని కోసం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను ఉపయోగించాలని చెప్పింది. అయోధ్యలో ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్ పీఎఫ్ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. డ్రోన్ జామర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.