కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సొంతగూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన శెట్టర్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వక పోవడంతో కాంగ్రెస్లో చేరారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం శెట్టర్ కు బీజేపీ సీనియర్ నేతలు బీఎస్ యడియూరప్ప, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర, ఆహ్వానం పలికారు. కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శెట్టర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న విశ్వాసం ఉందని చెప్పారు. యడియూరప్ప, ఇతర సీనియర్ నేతలు , కార్యకర్తలు పార్టీ లోకి రావాలని కోరడంతో తిరిగి సొంతగూటికి చేరానని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై శెట్టర్ తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరారు. హబ్బళ్లి ధార్వాడ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా ఓటమి తప్ప లేదు. శెట్టర్పై బీజేపీ నేత మహేశ్ 35 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డబ్బు పంచారంటూ శెట్టర్ ఆరోపించారు కూడా. అయినా ఏడాది కాకముందే తిరిగి బీజేపీ లోకి చేరడం గమనార్హం.