జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ… మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభమవుతుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.
సోమనాథ్ వ్యాస్ కుటుంబం1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది. 1992లో ఉత్తరప్రదేశ్లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జ్ఞానవాపి లోని దక్షిణ నేలమాళిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్ కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ తరఫు న్యాయవాది తెలిపారు.
జ్ఞానవాపి మసీదులోని నేలమాళిగలో ఉన్న దేవత విగ్రహానికి పూజలు జరిగేవి. డిసెంబరు 1993లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాళిగలో పూజలను నిషేధించారు. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్రంగ్ శర్మ, హరిహర్ పాండేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సర్వే నంబర్లు 9130, 31,32 లు కాశీ విశ్వనాథుని ఆస్తి అని నొక్కి చెప్పడం విశేషం.
మరోవైపు వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురతత్వశాఖ (ఏఎస్ఐ) ఇటీవల వెల్లడించింది. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది.
తవ్వకాల్లో బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు. తవ్వకాల్లో బయటపడిన వాటిలో సగం విరిగిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. కింది సగభాగం మాత్రమే ఉన్న ఈ శిల్పం కాళ్లు ఓ రాతిపై ఉన్నాయి. ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ కావడం గమనార్హం. మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభం కాలం నాటిది. ఇందులో సగం మనిషి, సగం సర్పం ఉంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహావతారాన్ని సూచిస్తోంది.
అలాగే, నాలుగు చేతులతో ఉన్న సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో వెలుగుచూసింది. అలాగే, మధ్యయుగ ప్రారంభం కాలంనాటి విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు లభ్యమయ్యాయి. ఇందులో ఒక విగ్రహం నాలుగు చేతులలో మూడు, ముఖం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ పీఠంపైన నిలబడిన ఆకారంలో ఉంది. మరోటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్టుగా ఉంది. మరో శిల్పం హనుమంతుడి పైభాగానికి సంబంధించినది. ఒక చేత్తో హనుమంతుడు గదాధారుడై ఉన్నాడు.