తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది అవార్డు’. సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని అందిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తరువాత సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలయింది. ఇక 2017 నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేసాయి. కాగా, తాజాగా కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు.
హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ పేరు మార్పు పై జీవోని జారీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతీ జయంతికి ఈ పురస్కార ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ప్రధానం చేస్తామని చెప్పారు.
‘మా తెలంగాణ లెజెండ్, బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ పేరు మీద ఎవరికి పురస్కారం వచ్చినా.. మీకొక గొప్ప అవకాశం. అందువల్ల ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదం తెలపండి’ అని సినీ కళాకారులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి గద్దర్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దర్ అని చెప్పారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడితే, ఆ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ గద్దరన్న ఉద్యమించారని చెబుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలే తమకు స్ఫూర్తి అని తెలిపారు.