కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని వికారాబాద్లో పెట్టడం దారుణమని, ప్రభుత్వం తన ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సహా అనేక ప్రపంచ వేదికల్లో గళం వినిపంచిన బీవీ సుబ్బారావు, వికారాబాద్ ప్రాంతంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాడార్ కేంద్ర ఏర్పాటు హైదరాబాద్ వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం కోసం ఏ మొక్కలను, చెట్లను కొట్టేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు? అని ప్రశ్నించారు.
వికారాబాద్ అడవుల్లో 12 లక్షల వృక్షాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోనే అత్యంత విలువైన, అరుదైన ఔషధ మొక్కలు వికారాబాద్ అడవుల్లో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిసెర్చ్ స్కాలర్లు 500కుపైగా ఔషధ మొక్కలను పేర్లతోపాటు గుర్తించారు.
సౌత్-వెస్ట్లో వికారాబాద్ ఉంటుంది. మన హైదరాబాద్కు వచ్చే గాలి సౌత్-వెస్ట్ నుంచే వస్తుందని చెబుతూ గాలి, నీటిని స్వచ్ఛంగా మార్చడంలో వికారాబాద్ అడవులు ఎంతో కీలకం అని తెలిపారు. గండిపేట నీళ్ల గురించి తెలియనిది ఎవరికి? గండిపేట నీళ్లు ఒంటికి మంచిదని అందరూ చెప్తుంటారని తెలిపారు.
గండిపేటకు నీళ్లు కూడా వికారాబాద్లో పుట్టే మూసీ నది వల్లనే వస్తాయని పేర్కొంటూ వీటన్నింటికి కారణం వికారాబాద్లో ఉన్న ఔషధ మొక్కలే అని స్పష్టం చేశారు. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
నేవల్ సిగ్నల్ స్టేషన్ ఇక్కడ కాకుండా మరెక్కడా పెట్టొద్దని ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ స్టేషన్ కోసం కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల ప్రాంతం ఇస్తామన్నారని చెబుతూ కోలార్ గనులను తవ్వడం ఆపేశారని చెప్పారు. అక్కడ పెడితే ఆ ప్రాంతం బాగుపడుతుందని, కొత్త టౌన్షిప్ వస్తుందని పేర్కొంటూ అనేక యూరోపియన్ దేశాల్లో ఇలాంటి వదిలివేసిన గనుల్లో అనేక టౌన్షిప్లు వచ్చాయని పేర్కొన్నారు.