జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయగానే రాత్రికి రాత్రి పూజలు పునః ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టీ తెలియజేశారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ పూజలు జరగడం లేదు.
మసీదు భూగృహంలో విగ్రహాల ముందు పూజారి పూజలు చేయవచ్చని జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ అయిన కొన్ని గంటలకే వ్యాస్జీ భూగృహం 31 ఏళ్ల తరువాత తెరవబడిందని ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలియజేశారు. దక్షిణ సెల్లార్ బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తెరవడమైందని తెలిపారు.
కోర్టు ఉత్తర్వును తాను పాటించానని జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. రాజలింగం తెలిపారు. సెల్లార్ను పరిశుభ్రం చేసిన తరువాత లక్ష్మీ, గణేశ్ దేవుళ్ల విగ్రహాలకు హారతి ఇవ్వడమైందని స్థానికులు కొందరు తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ తమను పిలవగా వెళ్లి నంది విగ్రహం ముందునున్న బారికేడ్లను తొలగించామని జిల్లా అధికారులు తెలియజేశారు.
ఇలా ఉండగా, జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు గురువారం సూచించింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంపైఅంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ను ఆశ్రయించి అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై రిజిస్ట్రార్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కు ఈ విషయం తెలియజేయగా, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా చీఫ్ జస్టిస్ వారికి సూచించారు.