* మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు
ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఓటాన్ బడ్జెట్లో కేంద్రం తాయిలాలు ప్రకటించలేదు. అయితే, మధ్యతరగతి వర్గానికి కాస్త ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంది. వేతనజీవులకు ఈసారి నిరాశే ఎదురైంది. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సహా ఇతర పథకాల జోలికి పెద్దగా వెళ్లలేదు.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోదీ 2.0. లో చివరి పద్దు అని తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ మరోసారి ఉంటుంది. అయినా తాయిలాల జోలికి పోలేదు ఎన్డీఏ సర్కార్.
బడ్జెట్ అనగానే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు సహా మధ్యతరగతి వర్గం ముఖ్యంగా వేటి ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? అనేదే ప్రధానంగా చూస్తారు. ఇది వారిపై నేరుగా ప్రభావం చూపుతుంటుంది. 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం వీటి గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అంటే ఆ రేట్లు యథాతథంగానే ఉండనున్నాయి. అయినా రేట్లు పెరగలేదులే అని ఊపిరి పీల్చుకున్నారు.
మధ్యంతర బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలమ్మ వీటి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ అంతకుముందే జనవరి 31న కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ తయారీలో ఉపయోగించే విడిభాగాల దిగుమతులకు సంబంధించి దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది 15 శాతంగా ఉండగా 10 శాతానికి తగ్గించింది.
ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి మరింత మద్దతు అందించి ప్రోత్సహించడం, ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫోన్లను ఎగుమతి చేయడానికి ఉద్దేశించి ఇలాంటి ప్రకటన చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే బ్యాటరీ కవర్లు, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్స్, యాంటెన్నా, సిమ్ సాకెట్స్, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెకానికల్ ఐటెమ్స్ వంటి వాటిపై దిగుమతి సుంకం తగ్గనుంది.
దీంతో వీటి ధరలు దిగిరానున్నాయి. ఇది స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గేందుకు కూడా దోహదపడనుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1న కేంద్రం వేరుగా మరో కీలక ప్రకటన చేసింది. విమాన ఇంధనం ధరల్ని భారీగా తగ్గించింది. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్ ధరల్ని కిలో లీటరుకు రూ. 1221 తగ్గించడం విశేషం.
గత బడ్జెట్ అంటే 2023 సమయంలో చాలా వస్తువుల ధరల్ని తగ్గించింది కేంద్రం. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, ష్రింప్ ఫీడ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వంటి ధరలు తగ్గాయి. సిగరెట్లు, ఎయిర్ ట్రావెల్, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తులు భారమయ్యాయి.
ఆయువుపట్టు అయిన వ్యవసాయరంగం ప్రగతిని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. వంటనూనెలు విభాగంలో దేశం స్వయం సమృద్థి చెందాల్సి ఉంటుంది. ఇందుకు చమురు గింజల పంటల ఉత్పత్తి దేశీయంగా మరింతగా పెరిగేలా చర్యలు తీసుకుంటారని వివరించారు. రైతులకు వ్యవసాయ అనుబంధం అయిన పాడిపరిశ్రమకు సరైన మద్దతు ఇచ్చేందుకు సమగ్ర రీతిలో కార్యక్రమం చేపడుతారని వివరించారు.
దేశంలో వంటనూనెలు నిత్యావసర సరుకు. అవసరాల మేరకు మనదేశం భారీ స్థాయిలో ఇతర దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. 2022 23 సంవత్సరంలో భారత్ ఏకంగా అవసరాల మేరకు దాదాపు 165 లక్షల టన్నుల నూనెలను దిగుమతి చేసుకుంది. దీనికి అయిన ఖర్చు రూ 1.38 లక్షల కోట్లు. వంటనూనె దిగుమతి భారం తగ్గించేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వంటనూనెల గింజల పంటలను రైతులు మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేందుకు వీలు కల్పిస్తున్నారని ఆర్థిక మంత్రి తెలిపారు.
ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందటి బడ్జెట్ 202324తో పోలిస్తే ఇప్పటి 2024 25 బడ్జెట్లో ఈ కీలక శాఖకు కేటాయింపులు 12.59 శాతం పెరిగాయి. అప్పటి బడ్జెట్లో సవరించిన కేటాయింపులు మొత్తం విలువ రూ 80,517.62 కోట్లుగా ఉంది. ఇప్పుడున్న ఆసుపత్రుల నిర్మాణ వ్యవస్థలను వినియోగించుకుని ప్రభుత్వం అదనంగా మరికొన్ని వైద్యకళాశాలలను ఏర్పాటు చేసే యోచనలో ఉందని వివరించారు. దీని కోసం ఏ కమిటీ ఏర్పాటు జరుగుతుంది.
ఈసారి కేంద్ర బడ్జెట్లో జలాల వాడకం , వెలికిలోకి తీసుకువచ్చే విషయాల జలశక్తి మంత్రిత్వశాఖకు రూ 98,418 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా 71 శాతం వరకూ నిధులు ప్రతిష్టాత్మక జలజీవన్ పథకానికి దక్కుతాయి. ఇంతకు ముందటి బడ్జెట్లో ఈ మంత్రిత్వశాఖకు రూ 96,549 కోట్లు కేటాయించారు. ఇక తాగునీరు, పారిశుద్ధం విభాగం (డిఒడిడబ్లుఎస్) వాటా రూ 77,390 కోట్లు.