సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయిన తర్వాత 11.30గంటలకు అమిత్ షా నివాసానికి చేూరుకున్నారు. దాదాపు గంట పాటు ఈ చర్చలు జరిగాయి
భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాయని చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ – తెలుగుదేశం మధ్య పొత్తు కుదిరితే బీజేపీ గెలిపు అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అమిత్షాతో భేటీకి ముందు చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీకి దేశప్రయోజనాలు ముఖ్యమైతే… తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కు పోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు.